Vijay Mallya: నేను రూ. 450 కోట్లకు కొన్నప్పుడు నవ్వారు.. ఆర్సీబీ అమ్మకంపై విజయ్ మాల్యా ఎమోషనల్ 

Vijay Mallya: నేను రూ. 450 కోట్లకు కొన్నప్పుడు నవ్వారు.. ఆర్సీబీ అమ్మకంపై విజయ్ మాల్యా ఎమోషనల్ 

Vijay Mallya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ లీగ్ కి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఆర్సీబీని సుమారు రూ.16,700 కోట్లకు దక్కించుకుంది. ఈ చారిత్రాత్మక డీల్‌పై ఆర్సీబీ మాజీ ఓనర్ విజయ్ మాల్యా రియాక్ట్ అయ్యారు. 2008లో తాను పెట్టిన పెట్టుబడి ఇప్పుడు 37 రెట్లు పెరగడంపై హర్షం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా ఆయన ఎమోషనల్ పోస్ట్ చేశారు. అప్పట్లో తనను చూసి నవ్విన వారందరికీ ఇప్పుడు బుద్ధి వచ్చినట్లైందని పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. 

విజయ్ మాల్యా తన తాజా ఎక్స్ పోస్ట్‌లో.. నేను 2008లో ఈ ఫ్రాంచైజీని రూ.450 కోట్లకు కొన్నప్పుడు చాలా మంది నన్ను చూసి నవ్వారు.. నా ఇన్వెస్ట్‌మెంట్‌ను కేవలం ఒక షో పుటప్ అని ఆరోపించారు.. కానీ నా టార్గెట్ ఒక్కటే.. రాయల్ ఛాలెంజ్ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తం చేయడమేన్నారు. అందుకే దీనికి ఆర్సీబీ అని పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ రోజు నా రూ.450 కోట్ల పెట్టుబడి ఏకంగా రూ.16,500 కోట్లకు పైగా పెరగడం నాకు ఎంతో గర్వంగా ఉందని విజయ్ మాల్వా రాసుకొచ్చారు. 

ఆర్సీబీకి ఈ స్థాయిలో బ్రాండ్ వాల్యూ రావడానికి ప్రధాన కారణం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని విజయ్ మాల్యా తెలిపారు. అండర్–19లో యువకుడిగా ఉన్న కోహ్లీని మా జట్టులోకి తీసుకున్నాం.. ఈ రోజు అతను ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌గా ఎదిగాడని ప్రసంశించారు. ఆర్సీబీకి ఢిల్లీ, ముంబై, పంజాబ్ లాంటి నగరాల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటానికి కోహ్లీనే ప్రధాన కారణం. ఆర్సీబీ ఎప్పటికీ నా డీఎన్ఏలో భాగమే అంటూ ఎమోషనల్ అయ్యాడు. 

ఆదిత్య బిర్లా గ్రూప్ లాంటి దిగ్గజ సంస్థ ఆర్సీబీని దక్కించుకోవడంపై విజయ్ మాల్యా ఆనందం వ్యక్తం చేశారు. కొత్త యజమానులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా.. ఈ టీమ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎల్లప్పుడూ జట్టుకు అండగా నిలవాలి, ఈ బ్రాండ్ విలువను మరింత పెంచాలని విజ్ఞప్తి చేశాడు. గతంలో యునైటెడ్ స్పిరిట్స్ ఆధీనంలో ఉన్న ఆర్సీబీ, ఐపీఎల్ 2026 నుంచి కొత్త మేనేజ్‌మెంట్ పరిధిలో రంగంలోకి దిగనుంది.